
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అతిచౌకైన, ట్రాఫిక్ ఇబ్బందుల్లేని సరికొత్త రవాణా వ్యవస్థ పేరు ‘స్కైట్రాన్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో కలసి జెర్రీ శాండర్స్, కొంతమంది ఔత్సాహిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అద్బుతమైన ఆలోచన ఇది! చైనా, జపాన్లలో నడుస్తున్న మ్యాగ్లెవ్ ట్రెయిన్స్ కు రివర్స్ టెక్నాలిజీ ఇది. బలమైన అయస్కాంతాలతో కూడిన ట్రాక్పై గాల్లో తేలుతున్నట్లు వేగంగా కదులుతాయి ఆ మ్యాగ్లెవ్ ట్రెయిన్లు. స్కైట్రాన్లోనూ ఇదే టెక్నాలజీ వాడతారు. కాకపోతే ఇక్కడ అయస్కాంతాలు అడుగున కాకుండా పైన ఉంటాయి. అదీ తేడా. ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటారా… ఈ ‘స్కైట్రాన్’ లో మేజర్ షేర్ ని సొంతం చేసుకుంది రిలయన్స్ సంస్ద.
అమెరికా ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ కంపెనీ స్కైట్రాన్లో మరోసారి భారీగా ఇన్వెస్ట్ చేసింది రిలయన్స్ సంస్ద. స్కైట్రాన్లో 26.76 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు రియలన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించించింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో స్కైట్రాన్లో రిలయన్స్ వాటా 54.4 శాతానికి చేరింది. అంటే స్కైట్రాన్లో ఇప్పుడు మెజారిటీ వాటా రిలయన్స్దే అన్నమాట.
ఈ సందర్బంగా రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ…ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగం, అత్యధిక సామర్థ్యంతో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అదించగల సత్తా స్కైట్రాన్కు ఉందని అన్నారు. స్కైట్రాన్లో మెజారిటీ వాటా దక్కించుకోవడం ద్వారా.. ప్రపంచం రూపురేఖలు మార్చగలిగే భవిష్యత్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నట్లు ఆయన తెలిపారు. కాలుష్య రహిత హై స్పీడ్ రాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్యారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని.. గాలి, శబ్ధ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని వెల్లడించారు.
ఇక స్కైట్రాన్ టెక్నాలిజీ విషయానికి వస్తే.. ప్రయాణీకులతో కూడిన ట్యాక్సీల్లాంటి వాహనాలు..20 అడుగుల ఎత్తయిన స్తంభాలను కలుపుతూ వేసిన అయస్కాంత ట్రాక్కు వేలాడుతూ ప్రయాణిస్తాయి. మోడల్ను బట్టి ఒక్కో వాహనంలో ఇద్దరు, నలుగురు కూర్చునే వీలుంది. స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా మనం ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించవచ్చు. మధ్యలో ఎక్కడా స్టాప్లు లేకపోవడం, మన స్టాప్ వచ్చిన చోట మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా వెహికల్ కిందికి దిగిపోవడం ఈ సిస్టమ్ ప్రత్యేకతలు. ఒక్కో మైలు స్కైట్రాన్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. మెట్రో రైలు ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటర్కు రూ.160 నుంచి రూ.280 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. కేరళ, బిహార్ రాష్ట్రాల్లోనూ స్కైట్రాన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి! దాంతో భారత్ ట్రాన్స్పోర్ట్ రంగం కొత్త పుంతలు తొక్కే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.