హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా… ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.
1) అజీమ్ ప్రేమ్జీ
ఇండియన్ బిల్గేట్స్ అనగానే గుర్తుకొచ్చే పేరు అజీమ్ ప్రేమ్జీ. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ ఒకరు. సంపదను సృష్టించడంలోనే కాదు, దాతృత్వంలోనూ అగ్రభాగాన నిలిచారు. ఆయన పుట్టిన రోజు ఈ రోజు. తండ్రి నుంచి సంక్రమించిన వంట నూనెల కంపెనీని ‘విప్రో’ అనే మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. భవిష్యత్తును ముందుగానే పసిగట్టిన ఈయన 1985లోనే కంప్యూటర్ల దిగుమతి, విక్రయాల వ్యాపారంలోకి ప్రవేశించారు. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని ఒడిసిపట్టి ఐటీ రంగంలో విప్రోను గొప్ప బ్రాండ్గా నిలిపారు.
అజీమ్ ప్రేమ్జీ ఇంజినీరింగ్ విద్య కోసం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కానీ, తండ్రి 1966లో కన్నుమూయడంతో మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్పై ఉన్న మక్కువ మాత్రం చావలేదు. చివరకు 2000వ సంవత్సరంలో స్టాన్ఫోర్డ్ నుంచి ఇంజినీరింగ్లో పట్టా పొంది తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ను విప్రోగా పేరుమార్చి 53 ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నడిపించారు. విప్రోను అనేక రంగాల్లో విస్తరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉన్న అవకాశాలను ముందుగానే గ్రహించి ఆ రంగంలోనూ అడుగుపెట్టారు. దేశంలోని తొలి ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో దాదాపు 175 దేశాల్లో ఇప్పుడు తన సేవలు అందిస్తోంది. 1,60,000 మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ప్రేమ్ జీ అనేక రంగాల్లో కంపెనీని విస్తరించి 53 ఏళ్లుగా విజయవంతంగా నడిపించారు. 22.6 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా విప్రోను తీర్చిదిద్దారని ఫోర్బ్స్ కథనం పేర్కొంది. 2019లో ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో ఆయన 36వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్జీ నిరాడంబరంగా ఉంటారు. బెంగళూరులో కంపెనీ ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లలోనే నివసిస్తారు. సొంత విమానంలో ప్రయాణించగలిగే స్తోమత ఉన్నా.. అందుకు ఆయన ఇష్టపడరు. కనీసం బిజినెస్ క్లాస్లో కూడా ప్రయాణించరు. సాధారణ పౌరులతో కలిసి ఎకానమీ శ్రేణిలోనే వెళ్లడానికి ఇష్టపడతారు. టొయోటా కరోలా కారును తానే సొంతంగా నడుపుకుంటూ ఆఫీస్కి వెళతారు. కంపెనీ క్యాంటీన్లో అందరితో కలిసి భోజనం చేస్తారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది.
2 హిందీ నటుడు మనోజ్ కుమార్
అలనాటి ప్రముఖ హిందీ సినిమా నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పుట్టిన రోజు ఈ రోజు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న అబ్బోట్టాబాద్ పట్టణంలో 1937జూలై 24న ఆయన జన్మించారు. దేశవిభజన జరిగిన తరువాత ఆయన తల్లితండ్రులు డిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. ఆయన 19 ఏళ్ల వయసులోనే ‘ఫ్యాషన్’ అనే సినిమాతో 1957లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1960లో విడుదలయిన ‘కాంచ్ కి గుడియా’ సినిమాతో ఆయన హీరోగా సినీ జీవితం ప్రారంభించారు. అప్పటి నుండి మళ్ళీ ఏనాడు వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు ఆయనకి. సుమారు రెండు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. పియా మిలన్ కీ ఆశ్, రేష్మి రూమల్, సుహాగ్ సిందూర్, నకిలీ నవాబ్, గ్రహస్థి, ఆప్నే హువే పరాయి, గుమ్నాం, సావన్ కి ఘట, నీల్ కమల్, మేరా నం జోకర్, పెహ్ చాన్, బలిదాన్, హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ తీ, హిమాలయ కి గోద్ మే, దో బదన్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు చేసారు.
ఫీల్డ్ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మనోజ్ కుమార్ ఒక మంచి రొమాంటిక్ హీరోగా మంచి పేరు సంపాదించుకొన్నారు. సూపర్ హిట్ చిత్రాలయిన ఉపకార్, పూరాబ్ ఔర్ పశ్చిమ్, షహీద్ వంటి దేశభక్తి సినిమాలకు ఆయనే దర్శకుడు. ఆ తరువాత మళ్ళీ రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి, సన్యాసి, దస్ నంబరి వంటి అనేక సూర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం 1995లో విడుదలయిన మైదాన్ ఏ జంగ్. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో తన కుమారుడు కునాల్ గోస్వామిని హీరోగా పెట్టి 1999లో జై హింద్ అనే దేశభక్తి చిత్రాన్ని నిర్మించారు. ఆయన మొత్తం 13 ఫిలింఫేర్ అవార్డులు, ఐదుసార్లు జీవనసాఫల్య పురస్కారాలు అందుకొన్నారు. 2009లో ఫాల్కే రత్న అవార్డు, 2012లో భారత్ గౌరవ్ అవార్డు అందుకొన్నారు. ఆయన 1957 నుండి 1995 వరకు సినీ పరిశ్రమలో ఉన్నా చాలా పరిమితంగా కేవలం 51 సినిమాలు మాత్రమే చేసారు. వాటిలో చాలా సినిమాలు ఆణిముత్యాల వంటివే. చాలా సినిమాలు సూపర్ హిట్లే.
3 విజయ్ ఆంటోని
బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ అంటోని. వైవిద్య కథలను ఎంచుకుని వైవిధ్యంగా రూపకల్పన చేయడంలో విజయ్ అంటోని సిద్ద హస్తుడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. విజయ్ ఆంటోని.. టాలీవుడ్లో ‘బిచ్చగాడు’ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. బిచ్చగాడు సినిమాలో అమ్మకు ప్రాణం అయినా ఇవ్వొచ్చు అనే పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమా టాలీవుడ్లో విజయ్ ఆంటోనీకి కాసుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను.. కథనాన్ని ఎంచుకుంటూ.. ముందుకు వస్తున్నారు. ఈ రోజు అంటే విజయ్ ఆంటోని అందరికీ తెలుసు కానీ..అసలు విజయ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు… అసలు హీరో కావాలని ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదు… ఓ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు… సంగీత దర్శకుడిగా తెలుగులో ‘మహాత్మ’, ‘దరువు’ చిత్రాలతో పాటు ఎన్నో తమిళ చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన ఆయన.. ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేదు. పోనీ, మంచి హైటు–వెయిటు, రంగు–రూపు ఉన్నాయా? అని చూస్తే… లేవనే చెప్పాలి. జస్ట్, ప్రేక్షకుల్లో ఒకరిలా.. సాదాసీదాగా ఉంటారు. మరి, వరుసగా ఇన్ని హిట్స్ ఎలా వస్తున్నాయంటే… విజయ్ ఆంటోని కథను నమ్మి సినిమాలు చేస్తారు. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ‘నకిలి’ నుంచి తాజా చిత్రం వరకూ… ప్రతి సినిమాలోనూ కథే హీరో. ఆరు పాటలు, ఫైట్లు, నాలుగు కామెడీ ఎపిసోడ్స్, రెండు సెంటిమెంట్ సీన్లు.. అనుకుంటున్న టైమ్లో కథే ప్రధానంగా సినిమాలు చేస్తున్నారాయన. కథను నమ్ముకుంటే సినిమా హిట్ అనే ఫార్ములాను నిరూపించారు.
- కేటీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామరావు. చిన్నప్పటి నుంచి చదువులో నెంబర్ వన్ గా ఉండేవారు. ఇంటర్ అయ్యాక ఎమ్ సెట్ రాస్తే .. ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చినా, ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ చేసారు. పూణే యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ , అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. సిరిసిల్ల నియోజకవర్గం నుండి 2009లో శాసనసభ సభ్యులుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యం ఉంది. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.2019 లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖలను కేటాయించారు.
- ) హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ పుట్టిన రోజు ఈ రోజు. ఫ్యాన్స్ ముద్దుగా ‘జేలో’ అని పిలిచుకునే ఆమె ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమన్ ఇన్ ద వరల్డ్’ అనే గుర్తింపు పొందింది. ‘అనకొండ’ (1997), ‘ఔట్ ఆఫ్ సైట్’ (1998) చిత్రాలతో హాలీవుడ్లోనే హైయిస్ట్ రెమ్యునేషన్ పొందిన హీరోయిన్ గా పేరు పొందింది. లాటిన్ తల్లిదండ్రులకు న్యూయార్క్లో పుట్టిన జెన్నిఫర్, ఐదేళ్ల వయసులోనే ఇద్దరు సోదరిలతో కలిసి సంగీతం, నృత్యం నేర్చుకుని వేదికలపై చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చేది. జిమ్నాస్టిక్స్, సాఫ్ట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి చేరిన జెన్నీ, ‘మై లిటిల్ గర్ల్’ సినిమాలో చిన్న వేషం కోసం ఆడిషన్స్కు వెళ్లి తెరపై కనిపించింది. అప్పుడే పెద్ద స్టార్ ని అవ్వాలని కలలు కంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇల్లు వదిలి మ్యూజిక్ ప్రదర్శనలతో ముందడుగు వేసింది. టీవీల్లో కనిపించింది. 1997లో సెలెనా బయోపిక్లో వేషంతో వెండితెర ముచ్చట తీర్చుకుంది. ఓ పక్క పాప్ మ్యూజిక్ ఆల్బమ్లు చేస్తూ, మరో పక్క సినిమాల్లో నటిస్తూ ఎదిగింది.
6 బి గోపాల్
తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ పుట్టినరోజు ఈ రోజు. కమర్షియల్ గా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో బి.గోపాల్ ఒకరు. ‘బొబ్బిలిరాజా’, ‘లారీ డ్రైవర్’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘చినరాయుడు’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘సమరసింహారెడ్డి, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’… ఇలా బాక్సాఫీసుకు రికార్డ్ కలెక్షన్స్ అందించిన సినిమాలు ఎన్నో ఆయన్నుంచి వచ్చాయి. ఎక్కువగా స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన బి.గోపాల్… వాళ్లని మాస్ కోణంలో ఆవిష్కరించడంలోనూ, అభిమానుల్ని మెప్పించడంలోనూ తనకంటూ ఒక మార్క్ ఉందని నిరూపించారు. బి.గోపాల్ అసలు పేరు బెజవాడ గోపాల్. పి.సి.రెడ్డి దగ్గర అసెస్టెంట్ గా పనిచేసి, కె.రాఘవేంద్రరావు దగ్గర ‘అడవిరాముడు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసారు. 12 యేళ్లపాటు ఆయన దగ్గరే ‘దేవత’, ‘జస్టిస్ చౌదరి’, ‘అగ్ని పోరాటం’ తదితర చిత్రాలకి పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దృష్టిలో పడిన బి.గోపాల్ ఆయన సంస్థలో, ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా ‘కలెక్టర్గారి అబ్బాయి’ తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. ‘రక్తతిలకం’, ‘విజయ్’, ‘స్టేట్రౌడీ’, ‘లారీడ్రైవర్’, ‘బొబ్బిలిరాజా’, ‘చినరాయుడు’, బ్రహ్మ’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘మెకానిక్ అల్లుడు’, ‘కలెక్టర్ గారు’, ‘అడవిలో అన్న’… ఇలా వరుసగా చిత్రాలు తెరకెక్కించారు ‘ప్రతిధ్వని’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు
ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.ఈ ఆర్టికల్ ని బెస్ట్ విషెస్ యూట్యూబ్ ఛానల్ వారి సౌజన్యం తో అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ ని వీడియో లో చూడడం కోసం కింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి